* * *
విజయవాడ నుండి గుంటూరు జిల్లాలోని కోటప్పకొండకు చక్కని రోడ్డు మార్గం ఉంది. ఎన్. ఎచ్. 16 మీద ప్రయాణం చేసి చిలకలూరిపేట వద్ద ప్రక్కకు తిరిగి దాదాపు రెండు గంటల్లో చేరతాము. ఎన్నాళ్లుగానో చూడాలనుకున్న కోటప్పకొండకు మిత్రులతో కలిసి బయలుదేరాము. మధ్యలో ఒక టోల్ గేట్ ఉంది.
ఈ కొండదాదాపు 1600 అడుగుల ఎత్తున ఉంది. దీనిని చేరేందుకు మెట్లమార్గం, రోడ్డుమార్గం కూడా ఉన్నాయి. 1761 సంవత్సరంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన గుండ రాయలు ఈ కొండపైకి మెట్ల మార్గాన్ని ఏర్పాటుచేసాడు. మెట్లమార్గంలో కొండపైకి చేరేందుకు వెయ్యిమెట్లున్నాయి. ఆ మెట్లు ఎత్తు ఎక్కువగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ గా శ్రీ కోడెల శివప్రసాదరావు గారున్న సమయంలో ఘాట్ రోడ్డు ఏర్పాటు జరిగింది. కోటప్పకొండను ప్రముఖ పర్యాటక స్థలంగా అభివృధ్ధి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు రోప్ వే ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇక్కడ మూడు శిఖరాలు దర్శనమిస్తాయి. దానివల్లనే ఈ ప్రాంతాన్ని త్రికూట పర్వతము, త్రికూటాద్రి అని కూడా పిలుస్తారు. వాటిని బ్రహ్మ, విష్ణు, రుద్ర శిఖరాలుగా పిలుస్తారు. చుట్టూ విశాలంగా పరుచుకున్న ఆకుపచ్చని కొండలు కంటికి, మనసుకి ఆహ్లాదాన్నిస్తాయి. ఘాట్ రోడ్డు పొడవునా అందమైన పూలమొక్కలు కనువిందు చేస్తాయి. ఘాట్ రోడ్డులో బ్రహ్మ, శేషతల్పం మీద విశ్రమించిన విష్ణుమూర్తి, లక్ష్మి, వినాయకుడు, ఇంకా పార్వతి, సరస్వతి, లక్ష్మివంటి దేవతామూర్తుల నిలువెత్తు విగ్రహాలు దర్శనమిస్తాయి. అలాగే మార్గమధ్యంలో పిల్లలకోసం ఏర్పాటుచేసిన పార్క్, మ్యూజియం కూడా ఉన్నాయి.కొండపైన ఉన్న బ్రహ్మ శిఖరంపైన త్రికోటేశ్వర స్వామి ఆలయం ఉంది. మొదటగా త్రికోటేశ్వరుడు రుద్ర శిఖరంపైన వెలిసాడని, ఆ తర్వాత బ్రహ్మ శిఖరంపైన ఆలయ నిర్మాణం జరిగిందని చెబుతారు. విష్ణు శిఖరం పైన పాపనాశేశ్వరుని దేవాలయం ఉంది. ఇక్కడ 687 అడుగుల ఎత్తైన శివుని విగ్రహం ఉంది.
ఈ కొండ చుట్టుప్రక్కల ఉన్నప్రకృతి సౌందర్యం వర్ణించశక్యం కానిది. ఇక్కడ కొన్ని తెలుగు సినిమా షూటింగులు కూడా జరిగాయి. ప్రేమాభిషేకం సినిమాలో ‘కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్నా’ అన్న పాట అత్యంత ప్రజాదరణ పొందింది.
కొండపైన ధ్యానమందిరం 2012 సంవత్సరంలో మన ప్రస్తుత ఉపరాష్ట్రపతి గారితో ప్రారంభం చెయ్యబడింది. దేవాలయ ప్రాంగణంలో కొండపైన విశాలమైన పార్కింగ్ స్థలం ఉంది. దేవాలయం వెనుక భాగంలో భక్తులు బసచేసేందుకు ఒక అతిథిగృహం ఉంది. ఇక్కడ కోతుల సంఖ్య ఎక్కువగా ఉంది. కానీ కాకులు మాత్రం కనపడవు. ఒక భక్తురాలికి కాకి వలన జరిగిన అసౌకర్యం కారణంగా కాకులు శాపం పొందాయని, అందువల్లనే అవి ఇక్కడ కనిపించవని చెబుతారు. ఆ శాపం మాట మనకు కచ్చితంగా తెలియకపోయినా కాకులు మాత్రం లేవు. యాత్రీకులకు అవసరమైన టాయిలెట్లు, స్నానపుగదులను శుభ్రంగా నిర్వహిస్తున్నారు. కొండపైన క్యాంటీన్ యాత్రీకులకు అల్పాహారాన్ని, కాఫీ, టీలను సరసమైన ధరలకు అందిస్తోంది. నాణ్యత, శుభ్రత విషయంలో ప్రమాణాలు పాటిస్తున్నారు.
ఈ కొండపైన శివుడు మేధో దక్షిణామూర్తిగా వెలిసాడని చెబుతారు. దక్షయజ్ఞం తరువాత శివుడు తపస్సు చేసిన ప్రాంతమిది. బ్రహ్మ, విష్ణుమూర్తులకు ఆయన బ్రహ్మజ్ఞానాన్ని ఇక్కడే ప్రసాదించాడని చెబుతారు. ఈ కొండపైన మిగిలిన పుణ్యక్షేత్రాల్లో లాగా పెళ్లిళ్లు జరగవు.
అత్యంత శక్తి కలిగిన పుణ్యక్షేత్రంగా సంవత్సరం పొడవునా భక్తులు ఈకొండను దర్శించినా, శివరాత్రికి మాత్రం పెద్దఎత్తున భక్తులు వస్తారు. ఆ సమయంలో అందంగా అలంకరించిన పెద్దపెద్ద ప్రభలను ఊరేగింపుగా కొండమీదకు తీసుకొస్తారు. ఈ ప్రభలు 60-70 అడుగుల ఎత్తున, ఒక్కోసారి వంద అడుగుల ఎత్తున కూడా చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు తయారుచేసి శివరాత్రి పండుగను ఒక ఉత్సవంగా జరుపుకుంటారు. ఘాట్ రోడ్డు దాటిన తరువాత ఎర్రనిమట్టి దిబ్బలు, వాటివెంట బంతి, కనకాంబరం వంటి పూల తోటలు, సొర, వంగ, టమాటా వంటి కాయకూరల తోటలు, ప్రత్తి వంటి వాణిజ్య పంటలు కనిపిస్తాయి.
కోటప్పకొండ యాత్ర ముగించుకుని అక్కడికి దాదాపు 50 కిలోమీటర్లపైగా ప్రయాణం చేసి కొండవీటికోటకు చేరుకున్నాము. సాతులూరు, నుదురుపాడు మీదుగా ప్రయాణం చేసాం. రోడ్డుమార్గం బావుంది. దారిలో చిన్నచిన్న టీ బంక్ లు ఉన్నాయి. గ్రామీణ జీవితం కనిపిస్తుంది. అయితే ఆ చిన్నచిన్న టీ బంకుల్లోనూ ఇంటర్నెట్, టి.వి. వంటి సౌకర్యాలున్నాయి. చిలకలూరిపేట, గుంటూరు మధ్య జాతీయరహదారిలో ప్రయాణించి ఈ కోట చేరుకోవచ్చు. జాతీయ రహదారికి 9కిలోమీటర్ల దూరంలో ఉందిది.
ఆంధ్రప్రదేశ్ లోని గిరిదుర్గాల్లో ఇది ప్రముఖమైనది. రెడ్డిరాజుల పౌరుషానికి నిలువుటద్దం ఈకోట. 1700 అడుగుల ఎత్తైన ఈ కోటలో 44బురుజులు, 32 మైళ్ల ప్రాకారాలు, 2ధాన్యాగారాలు ఉన్నాయి. లక్ష్మీనరసింహ ఆలయం, వేంకటేశ్వరాలయం ఉన్నాయి. కోటలోపల అపార శిల్పసంపద ఉండేదని తెలుస్తోంది.
కొండపైన నీటి వసతి కొరకు ముత్యాలమ్మ చెరువు, పుట్టాలమ్మ చెరువు, వెదుళ్ల చెరువు తవ్వించి వాటిని ఒకటి తరువాత ఒకటిగా నిండేలా ఏర్పాటు, అవి నిండిన తరువాత నీటిని వదిలేసేందుకు తూమువంటి ఏర్పాటు చేసాఅరు. అంతేకాక లోతైన బావులను తవ్వించారు. వాటిలోంచి నీటిని తోడేందుకు పొడవైన చాంతాళ్లను వాడేవారు. అందువల్లనే ‘కొండవీటి చాంతాడు’ అన్న నానుడి వచ్చిందట.
ఇప్పుడు అక్కడ శిధిలాలు మినహా ఏమీలేవు. ఈ కోటను 1353లో ప్రోలయ వేమారెడ్డి తన రాజధానిగా చేసుకున్నాడు. రెడ్డిరాజుల తరువాత బహ్మనీ రాజులు, ఒరిస్సా గజపతులు పాలించారు. కృష్ణదేవరాయలు 1516లో ఈ కోటను స్వాధీనం చేసుకున్నాడు. 1579 లో గోల్కొండ సుల్తాన్ కులీకుతుబ్ షా పాలించాడు. 1752 నాటికి ఇది ఫ్రెంచివారి అధీనమైంది.
కొండవీడు కోట అతి ప్రాచీనమైనది, ఘన చరిత్ర కలిగినది కూడా. కొండవీడు ప్రాంతం చేరినప్పుడు అక్కడ చుట్టుప్రక్కల ముస్లిం కుటుంబాలు ఎక్కువగా కనిపించాయి. గ్రామాలు నిశ్శబ్దంగా ఉన్నాయి. పేదరికం పరుచుకుని ఉంది.
కొండవీడు కోట 14వశతాబ్దంలో రెడ్డిరాజుల పాలనలో నిర్మించబడింది. ఇది గుంటూరు జిల్లా, యడ్లపాడు మండలంలో ఉంది. ఈ కోటప్రాంతం ట్రెక్కింగ్, హైకింగ్ వంటి సాహసక్రీడలకు అనువైనది. ప్రభుత్వం ఈ దిశగా అభివృధ్ధిచేసే ఆలోచనలో ఉంది.
కోట చుట్టూ ఉన్న 37 ఎకరాల విశాలమైన కందకం కొంతమేర పూడ్చి ఘాట్ రోడ్డు నిర్మాణం చేపట్టింది. 1966 సంవత్సరంలోనే దీనిని పురావస్తు శాఖ రక్షిత కట్టడంగా గుర్తించింది. రాష్ట్రప్రభుత్వం కూడా దీనిని రక్షితకట్టడంగా గుర్తించింది. ఈకోట పరిధిలో గుర్తింపున్న ప్రాంతం కత్తులబావి. దీనినే గోపీనాథ దేవాలయం అని కూడా అంటారు. ఇక్కడ నిధినిక్షేపాలున్నాయన్న నమ్మకంతో త్రవ్వకాలు జరుపుతున్నారని చెబుతున్నారు. ఈదారిలో చెంగిజ్ ఖాన్ పేట అన్న బోర్డు కనిపించింది. అయితే వివరాలు తెలియరాలేదు.ఈకోట పైకి చేరేందుకు మెట్లమార్గమే కాకుండా చక్కని ఘాట్ రోడ్డు కూడా ఉంది. చుట్టూ పచ్చని ఎత్తైన కొండలు ప్రకృతి ఒడిలో ఉన్న అనుభూతిని కల్గిస్తాయి. ఈ ఘాట్ రోడ్డు వినియోగంలో ఉన్నప్పటికీ అధికారికంగా దీనిని ప్రారంభించలేదని అక్కడివారు చెప్పారు. శిధిలమైన కోట ఆనవాళ్లు, చిక్కగా అలుముకున్న మొక్కలు, చెట్ల మధ్య ఆ శిధిలాలు దర్శనమిస్తాయి. కోటపైన పర్యాటకులకు ఎలాటి సూచనలున్న బోర్డులూ లేవు. ఆ పని ఇంకా జరగవలసి ఉంది. కానీ అక్కడ జనసందోహం మాత్రం ఉంది. ఎక్కువగా టీనేజ్ వయసున్న మగపిల్లలు, ఆడపిల్లలు బైక్ ల మీద రావటం కనిపించింది. టీలు, స్నాక్స్, సిగరెట్లు వంటివి అమ్ముతున్న చిరువ్యాపారులు ఉన్నారు.
ఈకోటని ఒక అద్భుతమైన పర్యాటకప్రదేశంగా అభివృధ్ధిచేసేందుకు కావలసిన అన్ని హంగులూ ఉన్నాయి. క్రొత్త్తగా ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పర్యాటకానికి పెద్దపీట వేసే ఆలోచనలో ఉన్నందున దీనిని వెంటనే అమలు పరచి కోటకు అవసరమైన సదుపాయాలు చేయవలసి ఉంది.
ఈ ప్రాంతంలో తిరిగినప్పుడు రాజస్థాన్ రాష్ట్రంలో చూసిన కోటలు తప్పక జ్ఞాపకం వస్తాయి. అటువంటి పర్యాటకస్థల ప్రాధాన్యం ఈప్రాంతానికి, ఇంతటి ఘన చరిత్ర కలిగిన కోటకి కల్పించవలసిన అవసరం ఎంతో ఉంది. ప్రభుత్వం తక్షణం కార్యరంగంలోకి అడుగుపెట్టాలి. అపురూపమైన భౌగోళిక పరిసరాలు, చరిత్ర కలిగిన కోటను తగినట్టుగా అభివృధ్ధిచేసి, ప్రపంచ పర్యాటకానికొక అద్భుతమైన కానుకను ఇవ్వవలసి ఉంది.
Though I am from Vijayawada I never heard about Kotappakonda.. Very happy that Anuradha has thrown light on the hidden tourist spot closer to Vijayawada. It is also interesting to note the historical significance of Kondaveeti kota. One more feather in the crown for Vijayawada,the youngest state capital region of India.
LikeLiked by 1 person
Thank you Seshu
LikeLike
Super details. I want to see right away. I was born and raised in vijayawada and I did not know about this. Pictures are very well captured. So serene and beautiful.
LikeLiked by 1 person
Thank you.
LikeLike