* * *
ఆంధ్ర ప్రదేశ్ లో కోనసీమ ప్రాంతం ప్రకృతి అందాలకి పేరు పెట్టిందని మనందరికీ తెలిసున్నదే. ఏప్రిల్ నెలలో మహారాష్ట్రలో స్థిరపడిన స్నేహితులు విజయవాడ వచ్చి ఆంధ్ర లో అందమైన, ప్రత్యేకమైన ప్రాంతాన్ని వీలైతే పంచారామాల్లాటి యాత్రని చేయించమని అడిగినపుడు ‘దిండి’ రిసార్ట్ మనసులో మెదిలింది. ఎన్నాళ్లుగానో చూడాలనుకుంటున్న ఈ రిసార్ట్ ని చూబించాలని బయలుదేరేం. అయితే ఈ ప్రాంతాలు క్రొత్తేమీ కాకపోయినా మా వాళ్లకి చూబించి, రెండు రోజుల పాటు ఆ భూతల స్వర్గంలో ఉండే అవకాశం వచ్చిందని సంబరపడ్డాం.
*
విజయవాడ నుంచి ఒక మూడు గంటల ప్రయాణం చేసి, దాదాపు 150 కిలో మీటర్ల దూరంలో ఉన్న దిండి చేరేం. అందమైన రోడ్డు ప్రయాణం సౌకర్యవంతంగా ఉంది. ఈ దిండి కోనసీమలో ఒక అందమైన గ్రామం. దిండి, రాజోలు, నర్సాపూర్, చించినాడ, యలమంచలి లంక, దొడ్డిపట్ల గ్రామాలను ఒరుసుకుని గోదావరి ఉపనది వశిష్ట ప్రవహిస్తూంది. ఈ రిసార్టుల నుంచి పేరుపాలెం బీచ్ కి, పంచారామాల యాత్రకి చాలా వీలుగా ఉంటుంది.
ఈ ప్రాంతంలో ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక శాఖవారి దిండి రిసార్ట్ ‘కోకోనట్ కంట్రీ రిసార్ట్’ ఒక ఎనిమిదేళ్లుగా ఉంది. బయట ప్రపంచానికి ఇప్పుడిప్పుడే తెలుస్తున్న ఈ దిండి, చుట్టుప్రక్కల అందాలను చూసేందుకు ఎక్కువగా హైదరాబాద్, విశాఖ ల నుంచి వస్తారని చెప్పారు.
*
ఇక్కడే పల్లవి రిసార్ట్, స్టెర్లింగ్ హాలిడే రిసార్ట్ వంటి ప్రైవేటు రిసార్టులు కూడా ఉన్నాయి. పల్లవి రిసార్ట్ లో నీటి ప్రవాహానికి ఎదురుగా కొన్ని విల్లాస్, పాండ్ విల్లాస్, ఎర్త్ విల్లాస్ లాటివి ఉన్నాయి. విల్లాస్ కాకుండా హౌస్ బోట్లు కూడా ఉన్నాయి వసతికి. చక్కటి రెస్టోరెంట్ కూడా ఉంది. ఇవన్నీ కూడా పాలకొల్లు పట్టణం నుంచి కేవలం 15కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి.
*
అక్కడకి చేరిన సాయంత్రం బయలుదేరి అంతర్వేది వెళ్లాం. ఇది సఖినేటిపల్లి మండలంలో ఉంది. దీన్ని దక్షిణ కాశీ గా పిలుస్తారు. నర్సాపూర్ కి అతి దగ్గరగా ఉంది. బంగాళాఖాతం, వశిష్ట నది కలిసే సంగమ ప్రాంతం ఇది. దీనిని అన్నా చెల్లి గట్టు గాను, సప్త సాగర సంగమ ప్రదేశం గానూ పిలుస్తారు. ఇక్కడి బీచ్ నిద్ర పోతున్నట్టుగా ఉంది. నర్సాపూర్ లేసు పరిశ్రమకి ప్రసిధ్ధి.
అంతర్వేది దేవాలయం ప్రత్యేకత గర్భ గుడిలోని లక్ష్మీ నరసింహ స్వామి పశ్చిమ ముఖంగా ఉంటాడు. ఆయన తో పాటు లక్ష్మీదేవిని చూడవచ్చు. ఈ దేవాలయం 15-16శతాబ్దాల్లో నిర్మించబడింది. 5 అంతస్థుల విమాన గోపురం ఈ దేవాలయం పైన చూడవచ్చు. గర్భగుడిలోకి ప్రవేశిస్తున్నప్పుడు పైన అందమైన వటపత్ర సాయి మూర్తిని చూడవచ్చు.
*
ఆ బీచ్ ని, దేవాలయాన్ని చూసి మా రూమ్ కి తిరిగి వచ్చాం. రెస్టొరెంట్ లో ఆర్డర్ పైన భోజనం తయారు చేసి ఇస్తారు. నిశ్శబ్దంగా ఈ ప్రపంచానికి ఆవల మరో లోకంలో ఉన్నట్టు ఉంది. ఆకాశం స్వచ్చంగా, నీలంగా, చాలా అందంగా ఉంది. తెల్లవారి నడక దారి పట్టి అక్కడ చుట్టూ ఉన్నమామిడి తోటలు, కొబ్బరి తోటలు చూసుకుంటూ, రాలి పడిన బుల్లి మామిడి పిందెల్ని రుచి చూస్తూ గోదావరి ఒడ్డుకి వెళ్లటం ఒక అద్భుతమైన అనుభవం. చుట్టూ ఉన్న ఇళ్లలోంచి పొయ్యి వెలిగించిన దాఖలాలు పొగ రూపంలో కనిపిస్తూ అక్కడి వారి దినచర్యను చెబుతోంది. పిల్లలు స్కూళ్లకి తయారవుతున్నారు. మాలాటి పరదేశీలను చిత్రంగా గమనిస్తూ వాళ్ల పనులు చేసుకుంటున్నారు. రకరకాల పక్షుల కూతలు ఆ ప్రాంతపు ఆకుపచ్చదనం, ఆ ప్రశాంతత……ఓహ్!
*
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ పర్యాటక శాఖవారి ‘దిండి కోకోనట్ రిసార్ట్’ కూడా విశాలమైన ఆవరణలో స్మిమ్మింగ్ పూల్ లాటి సదుపాయాలతో, హౌస్ బోట్ వసతి సదుపాయాలతో ఉంది. అయినా ప్రైవేటు రిసార్టులతో పోల్చి చూసేందుకు వీలు లేదు. ప్రభుత్వం వారు 3 వేల ఖరీదులో వసతి అందిస్తున్నారు. ఎ.సి.గదులు, చక్కని విశాలమైన బాల్కనీలు, వేడినీటి సౌకర్యం, కాంప్లిమెంటరీ బ్రేక్ ఫాస్ట్ తో సందర్శకుల్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. అయినా మెయిన్ టెనెన్స్ విషయంలో కొంత కొరత ఉందని ఒప్పుకు తీరవలసిందే. ఎక్కువగా కాలేజీ పిల్లలు బస్సుల్లో వచ్చి వీకెండ్లు గడిపి వెళ్తుంటారని చెప్పారు. కనీసం అక్కడి ప్రాంతాలకి క్రొత్తగా వచ్చిన వారికి వివరాలు అందజేసేందుకు బ్రోషర్లు కూడా అందుబాటులో లేవు.
*
మర్నాడు బ్రేక్ ఫాస్ట్ చేసి పాలకొల్లు లోని పంచారామం చూసేందుకు వెళ్లాం. దీనిని క్షీరారామం గా పిలుస్తారు. ఈ దేవాలయం తొమ్మిది అంతస్థులతో, 120 అడుగుల ఎత్తున ఉంది. ఇది చాళుక్యుల కాలంలో, 9వ శతాబ్దంలో నిర్మించబడింది. ఆంధ్ర ప్రదేశ్ లోని ఎత్తైన దేవాలయ గోపురాల్లో ఇది ఒకటి. ఇక్కడ క్షీరారామలింగేశ్వరుడి తో పాటు పార్వతి అమ్మవారిని చూడవచ్చు. పాలకొల్లు బట్టల వ్యాపారానికి ప్రసిధ్ధి.
*
ఇక్కడ నుంచి భీమవరం లోని మరొక పంచారామ ఆలయానికి వెళ్లాం. ఇది గునుపూడి లో ఉంది. ఇక్కడి పంచారామాన్ని సోమారామంగా పిలుస్తారు. ఇక్కడ శివలింగం అమావాస్య కి నలుపు రంగులోకి, పౌర్ణమికి తెలుపు రంగులోకి మారుతుంటుంది. ఇక్కడ అన్నపూర్ణ అమ్మవారి గుడి రెండో అంతస్థులో ఉంటుంది.
*
దేవాలయ సందర్శన ముగించుకుని వెనక్కి విజయవాడ వస్తూ కొల్లేరు సరస్సు మీదుగా వచ్చాం. ఇది ఏలూరు నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. దేశంలో ఉన్న పెద్ద మంచినీటి సరస్సుల్లో ఇది ఒకటి. కొల్లేరు సరస్సు కృష్ణా, గోదావరి డెల్టాల మధ్య ఉంది. రామిలేరు, బుడమేరు, తమ్మిలేరు ల నుండి నీరు సరస్సులోకి ప్రవహిస్తుంది. అది బయట ఉప్పుటేరులోకి ప్రవహిస్తుంది. కృష్ణా, గోదావరి డెల్టాలోని దాదాపు 67 పెద్ద, చిన్నకాలువల ద్వారా వ్యవసాయానికి నీటిపారుదల సౌకర్యం కలిగిస్తోంది. ఇక్కడ దాదాపు 20మిలియన్ల వలస, ప్రాంతీయ పక్షులకు వసతి దొరికేరి ఒకప్పుడు. ఈ సరస్సు 90 వేల హెక్టార్ల విస్తీర్ణంలో ఉంది. ఈ సరస్సులో ‘కొల్లేటి కోట ద్వీపం’ ఉంది. 1999 లో వైల్డ్ లైఫ్ శాంక్చురీగా దీనిని ప్రకటించారు.
ఈ సరస్సులో గత కొన్ని దశాబ్దాలుగా వేల సంఖ్యలో చేపల చెరువులు త్రవ్వటం వలన నీరు స్వచ్ఛతని కోల్పోయింది. మరికొంత వ్యవసాయ నిమిత్తం ఆక్రమణలకి లోనైంది. ఇప్పుడు ఈ సరస్సులో నీరు లేదు. అక్కడి ప్రాంతానికున్న పచ్చదనం, స్వచ్ఛత లేవు. దానికోసం వచ్చే పక్షుల లేవు. అక్కినేని కుటుంబరావు గారి రచనలోని కొల్లేరు సరస్సు ప్రాంతంలోని జీవన దృశ్శ్యాలు ఇప్పుడు అక్కడ కనిపించవు. రాష్ట్ర ప్రభుత్వం దీనిని కాపాడుకుందుకు ప్రయత్నాలు చేస్తే బావుంటుంది.
Wow!!Dindi resort is surrounded by many pilgrims. If we book place during festivals like, Dasara or Ramanavami it will be very fulfilling. Very interesting to know about Sivalingam in Bheemavaram.
Also very unfortunate to know about Kolleru lake.
LikeLike
Reblogged this on ద్వైతాద్వైతం.
LikeLike